ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ జంపింగ్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. నేతలు పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. అందరికంటే ముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో అసంతృప్తులు అంతా బయటికొస్తున్నారు. వైసీపీని వీడి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోతున్నారు. అదే సమయంలో వైసీపీ పార్టీలోకి కూడా కొందరు నేతలు చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కిశోర్ బాబు వైసీపీ బాట పట్టారు.
అవును కిశోర్ బాబు వైసీపీలో చేరిపోయారు. బుధవారం తన భార్య శాంతి జ్యోతితో కలిసి కిశోర్ బాబు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్లారు. ఈసందర్భంగా వైసీపీ అధినేత జగన్.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి వైసీపీలో చేర్చుకున్నారు. అయితే టికెట్ హామీతోనే కిశోర్ బాబు వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ కిశోర్ బాబుకు అసెంబ్లీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన కిశోర్ బాబు 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి బరిలోకి రావెల గెలుపొందారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. అయితే కొద్దిరోజుల తర్వాత టీడీపీ హైకమాండ్కు రావెల మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో టీడీపీ వ్యతిరేక వర్గంతో రావెల చేతులు కలిపారు. పలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడ్డారు.
ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల ముంగిట రావెల జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరుపున ప్రత్తిపాడు నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే బీజేపీలో చేరారు. బీజేపీ పెద్దలతో పొసగక పోవడంతో రావెల మళ్లీ జనసేన గూటికి వచ్చారు. అలా ఆ పార్టీలో కొద్దిరోజులు కొనసాగాక.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఏపీ వ్యవహారాలను రావెల చూసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో.. రావెల పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకే అధికార వైసీపీ కండువా కప్పుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ