ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. రెండో సారి అధికారంలోకి రావాలని వైసీపీ వ్యూహాలు రచిస్తుంటే.. ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించి అధికారం దక్కించుకోవాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో అనర్హత రాజకీయం కాక రేపుతోంది. వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన వారిపై అనర్హత వేటు వేస్తే.. తమ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లినవారిపై కూడా అనర్హత వేటు వేయాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీలో నుంచి వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లగా.. అటు నుంచి ఇటు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. నలుగురికి నలుగురు లెక్క సరిపోయింది. కానీ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఆనం రామ్నారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్కు, మండలి చైర్మన్కు వైసీపీ అధిష్టానం ఫిర్యాదు చేసింది.
అయితే వైసీపీ స్పీకర్కు ఫిర్యాదు చేస్తే.. తెలుగు దేశం పార్టీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. టీడీపీ కూడా శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయింది. వారి మీద వేటు వేస్తే.. తమ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని తెలుగు దేశం పార్టీ అంటోంది. తెలుగు దేశం పార్టీలో నుంచి వల్లభనేని వంశీ, బలరామ కృష్ణమూర్తి, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాల గిరిలు వైసీపీలోకి వెళ్లారు. ఈ నలుగురిపై కూడా అనర్హత వేటు వేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు బుధవారం శాసనసభ స్పీకర్కు టీడీపీ ఫిర్యాదు చేయనుంది.
ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేసినప్పటికీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి. మరి ఈ సమయంలో అనర్హత వేటు అంశాన్ని ఎందుకు అధికార, విపక్ష పార్టీలు తెరపైకి తీసుకొచ్చాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి అనర్హత రాజకీయం ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ