బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో బుధవారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఢిల్లీలో గంటసేపు సాగిన ఈ ప్రత్యేక భేటీలో రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్టు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
తిరుపతి ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపికపై జనసేన-బీజేపీ సంయుక్త కమిటీ:
జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ విలేకర్లతో మాట్లాడుతూ ” జేపీ నడ్డా ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి వచ్చాము. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను బీజేపీ జాతీయ అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లాం. పోలవరం ప్రాజెక్టు, అమరావతి పై చర్చించాం. బీజేపీ, జనసేన కూటమి రాజధాని చివరి రైతుకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తుంది. ఇవి నా మాటలు కాదు. జేపీ నడ్డా నోటి నుంచి వచ్చిన మాటలివి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నడ్డా దృష్టిలో ఉంచాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పి సమస్యాత్మకంగా ఉంది. దేవాలయాలను అపవిత్రం చేయడంతోపాటు, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రథాలు దగ్ధం చేశారు. ఈ పరిణామాలను వివరించాం. తిరుపతి ఉపఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి? ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలా అనేది త్వరలో వెల్లడిస్తాం. ఈ అంశంపై సంయుక్త కమిటీ వేసి, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయి” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ