ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. రాష్ట్ర శాసనసభ కార్యాలయం మొదటి అంతస్థులో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమ మద్ధతును ప్రకటించాయి. ఏపీ శాసనసభలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో రాష్ట్రానికి చెందిన 175 మంది ఎమ్మెల్యేలలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వినియోగించుకోనున్నారు. ఇక కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తెలంగాణ శాసనసభలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ముందుగా పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ఆర్కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనితా, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. ఎమ్మెల్యే ఓటు విలువను 1971నాటి జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY