తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం ఆరంభమైంది. ఈ మేరకు శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల తరపున నిలిచిన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు అధికార టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అధికార పక్షంతో పాటుగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా సిన్హాకే మద్దతు తెలుపుతుండటం విశేషం. కాగా మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీ చేస్తున్నారు.
అయితే శాసనసభలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేలు పోలింగ్లో పాల్గొననున్నారు. ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఒక్కో శాసనసభ్యుని ఓటు విలువ 132 కాగా మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల మొత్తం విలువ 15,708గా ఉంది. అలాగే వీరితో పాటు ఏపీకి చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా తెలంగాణ శాసనసభలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ఇంకా ఇతర టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారని సమాచారం. ఇక ఈ నెల 21న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ