అధికార పార్టీ ఎంపీగా ఉంటూనే.. మొదటి నుంచీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న రఘురామ కృష్ణంరాజు ఎట్టకేలకు పార్టీ మారారు. పాలకొల్లులో శుక్రవారం జరిగిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు. ఆయన టీడీపీలోకి రాక.. ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో అన్న చర్చ మొదలైంది. నరసాపురం పార్లమెంట్ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ఆయన మొదటి నుంచీ చెబుతూ ఉన్నారు. అయితే ఆ స్థానంలో ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీలో నిలిచారు.
అలాగే.. ఉండి అసెంబ్లీ స్థానం టికెట్ ఇస్తానని చంద్రబాబు రఘురామకు హామీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆ స్థానాన్నికూడా. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం. ఇప్పుడు రఘురామ రాకతో ఆ ఇద్దరిలో ఎవరికి ఎసరుపడుతుందో అన్న చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు.. అనంతరం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పరోక్షంగా టీడీపీకి సహకరించే ప్రయత్నాలు చేశారు. వైసీపీ, సీఎం జగన్పై బురద జల్లుతూ కాలం వెల్లబుచ్చారు. ఐదేళ్ల పాటు ఎంపీగా కొనసాగిన రఘురామకృష్ణరాజు.. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరలేదు. తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో.. ఏ పార్టీలో చేరకుండానే కూటమి నుంచి టికెట్ ఆశించారు. అన్ని పార్టీలు తనను ఆదరిస్తాయనుకున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం బీజేపీకి వెళ్లడంతో.. తనకే టికెట్ ఇస్తుందని భావించారు. కానీ బీజేపీ చాన్స్ ఇవ్వలేదు.
బీజేపీకి విధేయుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ నుంచి తనకు టికెట్ దక్కకపోవడానికి సీఎం జగనే కారణం అంటూ నిందలు వేసిన రఘురామకృష్ణరాజు.. ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకుని అసెంబ్లీ బరిలో ఉంటారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సేఫ్ ప్లేసుగా ఉన్న ఉండి స్థానం ఇస్తానని చంద్రబాబు రఘురామకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం. ఆయనను తప్పించి రఘురామకు టికెట్ ఇచ్చేలా డీల్ కుదిరిందని తెలుస్తోంది. అయితే.. రఘురామ నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికీ చెబుతుండడం చర్చనీయాంశం అవుతోంది. అయితే నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేది తానేని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని భూపతిరాజు శ్రీనివాసవర్మ చెబుతున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రాజకీయం హీటెక్కనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY