టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దమయ్యింది. త్వరలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాయుడు ఇటీవలే ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పాడు. తొలుత ముంబై ఇండియన్స్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఏకంగా ఆరు సార్లు ఐపీఎల్ విన్నింగ్ టీమ్ కి అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది కూడా ఐపీఎల్ లో ఓ మోస్తరుగా రాణించిన రాయుడు క్రికెట్ కి గుడ్ బై చెప్పి పొలిటిక్స్ ని ఎంచుకోవడం ఆసక్తిగా మారింది.
అంబటి తిరుపతి రాయుడు వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆయన పార్లమెంట్ బరిలో ఉండాలనే ఆసక్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ అయిన రాయుడు తన అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చినట్టు సమాచారం. అయితే గుంటూరు ఎంపీ టికెట్ విషయంలో వైఎస్సార్సీపీ అధిష్టానం వరుసగా మూడోసారి కూడా ప్రయోగం చేస్తుందా అన్నది చర్చనీయాంశం అవుతోంది. వరుసగా 2014,19 ఎన్నికల్లో కూడా ఆపార్టీ ఓటమి పాలయ్యింది. తొలుత కాపు కులానికి చెందిన కిలారి రోశయ్యను పోటీలో పెట్టి ఓడిన తర్వాత 2019లో మాజీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే ఇద్దరూ టీడీపీకి చెందిన కమ్మ నేత గల్లా జయదేవ్ చేతిలో పరాజయం పాలయ్యారు. దాంతో ఈసారి కాపు, రెడ్డి కాకుండా కమ్మ నేతను పోటీలో పెట్టే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం నరసారావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుని గుంటూరు నుంచి పార్లమెంట్ కి పోటీలో పెట్టే ప్రయత్నం జరుగుతుందని ప్రచారంలో ఉంది. అందుకు ఆయన సిద్ధపడతారా లేదా అన్నది సందేహమే. అదే సమయంలో టీడీపీలో అసంతృప్తిగా ఉన్న గల్లా జయదేవ్ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు ఊహాగానాలున్నాయి. దాంతో వైఎస్సార్సీపీ నుంచి రాయుడికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కనిపించడం లేదు. గుంటూరు కాకపోతే బందరు లేదా కాకినాడ ఎంపీ సీటుని రాయుడు కోరుతున్నట్టు సమాచారం. ఆ రెండు చోట్ల కూడా కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తనకు కలిసి వస్తుందని రాయుడు ఆశిస్తున్నారు. అయితే బందరు ఎంపీగా ప్రస్తుతం వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఆయన్ని కాదని రాయుడికిచ్చే అవకాశాలు తక్కువే. అయితే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత దృష్టి అంతా పిఠాపురం అసెంబ్లీ సీటు మీద ఉంది. కాబట్టి కాకినాడ సీటు రాయుడికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యువకుడు, అందులోనూ క్లీన్ ఇమేజ్ ఉండడం, క్రికెటర్ గా మంచి గుర్తింపు కూడా కలిసి వస్తుందనే అభిప్రాయం ఉంది. అయితే రాయుడు మాత్రం గుంటూరు జిల్లాలో పొన్నూరు అసెంబ్లీ సీటు విషయంలో కూడా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆయన గడిచిన రెండు రోజులుగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పర్యటించారు. తన బంధువులను కలిశారు. ముట్లూరులో మీడియాకు తన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా చెప్పేశారు. దాంతో పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్యకి ఈసారి సీటు కష్టమేనని ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయన స్థానంలో రాయుడు రంగంలోకి వచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. అయితే దూళిపాళ్ల నరేంద్ర లాంటి సీనియర్ టీడీపీ నేతను ఢీకొట్టాలంటే రాయుడు లాంటి న్యూ ఎంట్రీతో సాధ్యమా కాదా అన్నది ఆసక్తికరమే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE