సంక్రాంతి పండుగ వస్తుందంటేనే తెలుగువారందరికీ కోడి పందేలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలకు ఆ సమయంలో దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది క్యూ కడతారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కోడిపందేలను చూసి మురిసిపోతారు. అయితే ఈ సారి కోడిపందేలలో దేశవాళీ కోడిపుంజులకు దీటుగా విదేశీ జాతులైన పెరు కోడిపుంజులను పందెం రాయుళ్లు బరిలోకి దింపుతున్నారు. దేశవాళీ కోడిపుంజుతో పోలిస్తే విదేశీ జాతికి చెందిన పెరు పుంజులు ఎక్కువసేపు పోరాడతాయని..పందెం రాయుళ్లు చెబుతున్నారు.
సంక్రాంతి కోడి పందేలలో కనిపించే మన దేశవాళీ కోడి పుంజులు 22 అంగుళాల నుంచి 26 అంగుళాల ఎత్తు వరకు ఉండటంతో పాటు నిటారైన తోకతో పొడవాటి కాళ్లతో కనిపిస్తాయి. కానీ పెరు జాతి కోడిపుంజు 16 నుంచి 20 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటాయి.వీటి తోక భూమికి వంగి ఉంటుంది. అంతేకాకుండా దేశవాళీ కోడిపుంజు కన్నా పెరు జాతి కోడిపుంజు సైజులో చిన్నదిగా ఉంటుంది. అంతేకాదు పెరు కోడిపుంజు కన్నా దేశవాళీ కోడిపుంజు బలిష్టంగా ఉంటుంది.
కానీ పోరాట పటిమ విషయానికి వస్తే మాత్రం పెరు జాతి స్పీడ్ ఎక్కువ. పోటీలో దింపిన వెంటనే పెరు జాతి కోడిపుంజు వేగంగా పోరాడటమే కాకుండా బరిలో ఎక్కువ సేపు ఉంటుందట. ఆకారంలో చిన్నగా ఉండటం, బరువు తేలికగా ఉండటంతో బరిలో ప్రత్యర్థి కోడిపుంజుకు చిక్కకుండా పోరాడి చివరకు విజయాన్ని సాధిస్తుందట. అందుకే చాలామంది పందెం రాయుళ్లు ఈసారి సంక్రాంతి కోడి పందేల కోసం పెరు కోడి పుంజులనే పెంచుతున్నారు.
ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెరు పందెం పుంజులతో ..పందెం రాయళ్లు ఇప్పటికే పందేల కోసం సిద్ధమయ్యారు. కానీ ఈసారి ఈ పందెం పుంజుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ పెరు పందెం పుంజు ధర ప్రస్తుతం సుమారు రూ. ఒక లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు పలుకుతుంది. ఈ కోడిపుంజులను బట్టే రూ. లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు పందేలు కడతారు.
పందాలలో తలపడే ఈ పందెం కోళ్లు ప్రత్యేక తయారీకి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఒక్కొక్క కోడిపుంజుకు సుమారు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు పెడతారు. ఇక విదేశీ కోళ్లయిన పెరు పుంజుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో ఈ ఖర్చు మరింత ఎక్కువవుతుంది. వాటి పెంపకానికి తగిన వాతావరణ పరిస్థితులను కల్పించడానికి అదనపు ఖర్చవుతుంది.
పుంజుల జాతిని బట్టి, రంగును బట్టి, కొందరైతే నక్షత్రాలను బట్టి కూడా పెద్ద ఎత్తున పందేలు కాస్తుంటారు. పండగ మూడు రోజులు ఉమ్మడి గోదావరి జిల్లాలో సుమారు రూ. 250 నుంచి రూ. 300 కోట్లు చేతులు మారుతాయని అంచనా వేస్తున్నారు. కోడిపందాల వీక్షణ కోసం వచ్చేవారి కోసం, పందెం రాయుళ్ల కోసం బరుల వద్ద ప్రత్యేకమైన వంటకాలు, రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతారు. ముఖ్యంగా పందెం బరుల వద్ద కోజా మాంసంతో చేసే స్పెషల్స్కు యమా డిమాండ్. పందెంలో ఓడిపోయిన పుంజులని కోజా అని పిలుస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE