ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 6, శుక్రవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- విద్యారంగంలో కీలక మార్పులకు కేబినెట్ ఆమోదం. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ సెంటర్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్ స్కూళ్లు, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లను సంస్కరణల్లో భాగంగా ఆరు రకాలుగా వర్గీకరణకు ఆమోదం. శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2), ఫౌండేషనల్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు), ఫౌండేషనల్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1 నుంచి 5వ తరగతి వరకూ), ప్రి హైస్కూల్స్ ( 3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకూ), హైస్కూళ్లు ( 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ), హైస్కూల్ ప్లస్స్కూళ్లు ( 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) గా వర్గీకరణ.
- తొలివిడత నాడు – నేడుకోసం ఇప్పటికే రూ.3,669 కోట్లు ఖర్చు, ఈ పనులకోసం మొత్తంగా రూ.16,021.67 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం.
- ఈ ఏడాది విద్యాకానుకకు కేబినెట్ ఆమోదం.
- 2021–22 సంవత్సరానికి గానూ ఆగస్టు 10న వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు, సొంత మగ్గంమీద నేసే కార్మికుడి కుటుంబానికి రూ.24వేల చొప్పున ఆర్థిక సహాయం, బడ్జెట్లో రూ.199 కోట్లు కేటాయింపు.
- అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపునకు కేబినెట్ ఆమోదం, రూ.20వేల లోపు డిపాజిట్దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ. ఆగస్టు 5వరకూ అందిన వివరాల ప్రకారం సుమారు 4 లక్షల మంది డిపాజిట్దారులకు సుమారు రూ. 511 కోట్లు అందజేయనున్న ప్రభుత్వం.
- పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10లక్షల ప్యాకేజీకి కేబినెట్ఆమోదం, దాదాపు రూ.550 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, గతంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.
- పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్కోసం ఉద్దేశించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం, జగనన్న స్వచ్ఛసంకల్పం కింద అర్భన్, రూరల్ ప్రాంతాల్లో 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు.
- రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. అలాగే గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గూడా) పేరును కాకినాడ అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (కూడా)గా మారుస్తూ నిర్ణయం.
- అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని అక్రమణల క్రమబద్ధీకరణ, అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్దీకరణ.
- 1977 నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం (పీఓటీ)లో చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం. అసైన్డ్ భూమి లేదా, అసైన్డ్ ఇంటి విక్రయానికి ఇప్పుడున్న గడువును 20 ఏళ్లనుంచి 10 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం. సవరించిన చట్టం అమల్లోకి వచ్చేనాటికి అసైన్డ్భూమి, అసైన్డ్ ఇంటిని ఎవరికైనా విక్రయిస్తే వాటికి ఆమోదం. అలాగే చట్టం అమల్లోకి వచ్చేనాటికి ఇలా చేయాలనుకుంటే నిర్దేశించుకున్న విధానం ప్రకారం నిర్దేశించిన ఫీజులను అనుసరించి విక్రయానికి అనుమతులు ఇవ్వాలని నిర్ణయం.
- అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో నిర్మిస్తున్న పలు భవనాలకు ప్రభుత్వ స్థలాల కొరత నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రైవేటు భూమిని నిర్మాణాలకు తీసుకుని దానికి బదులు మరోచోట ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు, అంగన్వాడీ సెంటర్లు, సీడ్ గ్రోయింగ్ సెంటర్లు, మల్టీ ఫెసిలిటీ సెంటర్లు, 90 రోజుల్లోగా ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాలు నిర్దేశిత సమయంలోగా వీటి నిర్మాణాలు పూర్తయ్యేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్న మంత్రివర్గం.
- మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం ఉద్దేశించిన రివైజ్డ్ డీపీఆర్కు కేబినెట్ ఆమోదం, రూ.5,155.73 కోట్లతో పోర్టు నిర్మాణం, 36 నెలల్లో పోర్టు నిర్మాణం చేయాలని లక్ష్యం.
- శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు రివైజ్డ్ డీపీఆర్కు కేబినెట్ ఆమోదం. ఫేజ్–1 లో భాగంగా రూ. 4361.9 కోట్లతో పోర్టు నిర్మాణం, పోర్టుకోసం భూసేకరణ, 30 నెలల్లో పోర్టును నిర్మించాలని లక్ష్యం.
- ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం, శ్రీకాకుళం జిల్లా బుడగట్ల పాలెం, విశాఖజిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపు తిప్పల్లో షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. రూ.1720.61 కోట్లతో వీటి నిర్మాణం.
- ఆగస్టు 13న నిర్వహించనున్న వైఎస్ఆర్ లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డులకు ఆమోదం.
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాల దృష్ట్యా హైదరాబాద్లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని నిర్ణయం.
- హైకోర్టు అభిప్రాయాల నేపథ్యంలోనే రాష్ట్ర మావనహక్కుల సంఘం కార్యాలయాన్నికూడా కర్నూలుకు తరలించాలని నిర్ణయం.
- గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు ఆమోదం.
- రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్ 2021కి ఆమోదం.
- రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం.
- ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్ఆమోదం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ