ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో వర్గ విబేధాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలోనే సీఎం జగన్ సీటు ఫలానా వారికేనని తేల్చేసి అందరిముందూ సమస్యకు పరిష్కారం చూపించేసినా ఇప్పుడు కొంత మంది నేతలు తెరపైకి వస్తున్నారు. అవసరమైతే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటున్నారు కానీ తగ్గడం లేదు. ఇలాంటివి చాలా నియోజకవకర్గాల్లో ప్రారంభమయ్యాయి. వీటికి మొదట్లోనే చెక్ పెట్టాలని వైసీపీ వ్యూహకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటివి పెరిగిపోతున్నాయి.
వైసీపీలో అభ్యర్థుల్ని సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేస్తూ వస్తున్నారు. అలాగే రామచంద్రాపురంలో అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణను ఖరారు చేశారు. మొదట్లో పెద్దగా స్పందించని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ ఇప్పుడు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు..పిల్లి సూర్యప్రకాశ్కు టికెట్ ఇవ్వడానికి జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నవార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున సూర్యప్రకాశ్.. రామచంద్రాపురం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటు సీఎం జగన్.. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అక్కడ ఒకవైపు అధినేత కుటుంబానికి విధేయుడిగా ఉంటూ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయనతో నడిచిన వ్యక్తి ఒకరైతే, తానే టిక్కెట్టు ఇచ్చి, ఎమ్మెల్యేను చేసి మంత్రిని చేసిన వ్యక్తి మరొకరు.
అంతేకాదు..ఏకంగా పిల్లి సుభాష్ చంద్రబోస్కు అసంతృప్తికి లోనయి.. వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే..తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారన్న టాక్ గట్టిగా నడుస్తోంది. ఇవన్నీ చూస్తున్న వైసీపీ.. ఎన్నికల ముందు పిల్లి పార్టీని వీడితే జరిగే నష్టాలు అంచనా వేస్తోంది. పిల్లి సుభాష్ పార్టీని వీడకుండా పెద్దలతో మంతనాలు జరిపించింది. మంగళవారం మధ్యాహ్నం విజయవాడలో పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్తో మిధున్ రెడ్డి సమావేశమయ్యారు. వైసీపీని వీడొద్దని.. తొందరపడి వైసీపీ నుంచి వెళ్లిపోవద్దని బుజ్జగించారు. అంతేకాదు త్వరలోనే దీనిపై మీడియా సమావేశం నిర్వహించి స్పష్టత ఇవ్వాలని మిధున్ రెడ్డి.. పిల్లి సుభాష్ చంద్రబోస్ను కోరారు.
అదే సమయంలో గన్నవరం పంచాయతీ తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి తానే పోటీ చేస్తున్నానని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. నిజానికి ఇక్కడ కూడా టిక్కెట్ వంశీకేనని.. జగన్ గతంలోనే చెప్పారు. కానీ యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఇలా నందికొట్కూరు, నగరి, సత్తెనపల్లి చెప్పుకుంటూ పోతే కనీసం యాభై నియోజకవర్గాల్లో వర్గ పోరు ఉందని వైసపీ వర్గాలు చెబుతున్నాయి.
పిల్లి సుభాష్, చెల్లుబోయిన వేణుల మధ్య వ్యవహారం మీడియాకు ఎక్కడం.. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావూ అదే పని చేయడంతో వైసీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది. ఎవరైనా పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు పంపింది. రాష్ట్రంలో గ్రూపిజం నడుస్తున్న పలు నియోజకవర్గాలపై కూడా అధిష్టానం సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ సమస్య సున్నితంగా ఉందో అక్కడ ముందుగా ఒక నిర్ణయం తీసుకుని తేల్చేయాలని అనుకుంటోంది. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలను కూడా సస్పెండ్ చేసింది. ఇలాంటి వాటికీ కూడా వెనుకాడబోమని హెచ్చరికలు హైకమాండ్ పంపుతోంది.
ఇప్పటికే ఏఏ జిల్లాల్లో ఎవరెవరి మధ్య గ్రూపిజం నడుస్తుందన్న దానిపై పక్కా సమాచారాన్ని చేతిలో పట్టుకున్న జగన్ ఆచితూచి అడుగులేయాలని నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయి స్వయంగా బాలినేని ఇంటికి వెళ్లి గంటకు పైగా చర్చలు జరిపారు. అధిష్టానం చెప్పిన పలు అంశాలను ఆయనకు వివరించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో చేసిన రాజీనామాను ఉపసంహరించుకుని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని సూచించినట్లు తెలిసింది. ఇలా బుజ్జగించాల్సిన వాళ్లు ఎవరైనా ఉంటే.. లిస్ట్ రెడీ చేసుకుని పార్టీ నాయకుల్ని వారి వద్దకు పంపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE