గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 134 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (నవంబర్ 1, మంగళవారం) పరిశీలించనున్నారు. ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలోనే ఉన్న ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం మోర్బీకి చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు.
అలాగే సోమవారం ఉదయం రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా గుజరాత్ లోని కెవాడియాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా తాను కెవాడియాలో ప్రజల మధ్యలో ఉన్నాను కానీ తన మనసు మాత్రం బాధిత కుటుంబాలపైనే ఉందని ప్రధాని అన్నారు. గుజరాత్ ప్రభుత్వం వారితో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి శక్తి మేర సహాయక చర్యలు చేపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మరియు నేవీ బృందాలు, స్థానిక రాష్ట్ర సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయి. కాగా ఇప్పటికే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు రాష్ట్ర మంత్రులు మోర్బీలో ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE