భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే టికెట్ రాయితీని నిలిపివేయడం ద్వారా రెండేళ్లలో అదనంగా రూ. 1500 కోట్లు సంపాదించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత టికెట్ రాయితీని నిలిపివేయడం ద్వారా మార్చి 2020 నుండి 2022 వరకు ఈ రెండేళ్లలో సీనియర్ సిటిజన్ ప్రయాణికుల నుండి రైల్వే రూ. 1,500 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని ఆర్జించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన RTI ప్రశ్నకు రైల్వే తన సమాధానంలో, మార్చి 20, 2020 మరియు మార్చి 31, 2022 మధ్య 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఎటువంటి రాయితీలు అందించలేదని పేర్కొంది.
వీరిలో 4.46 కోట్ల మంది పురుషులు, 2.84 కోట్ల మంది మహిళలు, 8,310 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, ఈ కాలంలో సీనియర్ సిటిజన్ ప్రయాణికుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం రూ. 3,464 కోట్లు కాగా, ఇందులో రాయితీని నిలిపివేయడం ద్వారా అదనంగా రూ. 1,500 కోట్లు ఆర్జించబడిందని ఆ లేఖలో తెలిపింది. సాధారణంగా మహిళా సీనియర్ సిటిజన్లకు టికెట్ చార్జీలో 50 శాతం రాయితీ లభిస్తుండగా, పురుషులు మరియు ట్రాన్స్జెండర్లు రైళ్లలో అన్ని తరగతుల్లో 40 శాతం వరకు రాయితీకి అర్హులు. కాగా ఈ ప్రత్యేక రాయితీని పొందేందుకు స్త్రీలకి కనీస వయోపరిమితి 58 కాగా, పురుషులకి 60 ఏళ్లుగా నిర్ధారించారు.
అయితే వివిధ రకాల ప్రయాణీకులకు అందించే దాదాపు 53 రకాల రాయితీల కారణంగా ఇండియన్ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు భారాన్ని మోస్తోందని, దీనిని తగ్గించటానికి రైల్వే రాయితీల ఉపసంహరణే మార్గమని ఇప్పటికే అనేక కమిటీలు సిఫార్సు చేశాయి. ఈ నేపథ్యంలో.. రైల్వే శాఖ కొన్ని రాయితీల ఎత్తివేతకు మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం ‘గివ్ ఇట్ అప్’ పథకానికి పిలుపునివ్వగా.. సీనియర్ సిటిజన్ ప్రయాణీకుల నుండి ప్రతిస్పందన ఆశించినంతగా రాలేదు. మొత్తం 4.41 కోట్ల మంది సీనియర్ సిటిజన్ ప్రయాణికుల్లో 7.53 లక్షల మంది (1.7 శాతం) 50 శాతం రాయితీని వదులుకోగా, 10.9 లక్షల మంది (2.47 శాతం) 100 శాతం రాయితీని వదులుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ