గత కొన్ని రోజులుగా రైల్వే ఛార్జీలు పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వేల ఆదాయంలో ఇటీవల గణనీయంగా మార్పులు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఛార్జీలను ఒకేసారిగా పెద్ద మొత్తంలో కాకుండా స్వల్పంగా పెంచారు. పెరిగిన టికెట్ ధరలు జనవరి 1, 2020 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్కు కిలోమీటర్కు ఒక పైసా చొప్పున, అలాగే మెయిల్/ఎక్స్ ప్రెస్ సెకండ్క్లాస్, స్లీపర్క్లాస్, ఫస్ట్క్లాస్కు కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఏసీ ఛైర్ కార్, ఏసీ 3టైర్, 2 టైర్, ఏసీ ఫస్ట్క్లాస్కు కి.మీ.కు 4 పైసలు చొప్పున పెంచారు. రైల్వే చార్జీల పెంపుపై డిసెంబర్ 31, మంగళవారం నాడు కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో చివరిసారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. ఆ సమయంలో ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం, సరకు రవాణా ఛార్జీలు 6.5 శాతం వరకు పెంచారు.
[subscribe]