భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం 8:54 గంటలకు కౌంట్డౌన్ మొదలుపెట్టారు. 25.30 గంటల కౌంట్డౌన్ అనంతరం ఫిబ్రవరి 28, ఆదివారం ఉదయం 10:24 గంటలకి పీఎస్ఎల్వీ-సీ51 ను నింగిలోకి పంపాలని ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా నిర్ణయించారు. ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్ కు చెందిన అమెజోనియా-1 ఉపగ్రహంతో పాటుగా మన దేశానికి చెందిన 18 (12 స్పేస్ బీస్, నానో కాంటాక్ట్–2, సింధునేత్ర, సతీశ్ ధావన్ శాట్, యూనిటీశాట్ 3 ఉపగ్రహాలు) ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) యొక్క 53 వ మిషన్ అయిన పీఎస్ఎల్వీ-సీ51/అమెజోనియా-1 అనేది ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) యొక్క మొట్టమొదటి కమర్షియల్ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా అమెజోనియా-1 ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా అమెజాన్ ప్రాంతంలో అటవీ నిర్మూలన పర్యవేక్షణ మరియు బ్రెజిలియన్ భూభాగంలో వ్యవసాయం విశ్లేషణపై రిమోట్ సెన్సింగ్ డేటాను సేకరించనున్నారు. మరోవైపు ఇస్రో చైర్మన్ కే.శివన్ శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో పీఎస్ఎల్వీ-సీ51 మొదటి శాటిలైట్ ప్రయోగమని, అలాగే ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదేనని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ