టోక్యో ఒలింపిక్స్-2020 జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. శనివారం సాయంత్రం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలోనే 87.58 మీటర్ల విసిరాడు. దీంతో ఫైనల్లో మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ ప్రదర్శనే (87.58 మీటర్లు) ఉత్తమంగా నిలవడంతో, అందరికంటే మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా తిరుగులేని ప్రదర్శనతో ఒలిపింక్స్ చరిత్రలోనే అథ్లెటిక్స్ విభాగంలో దేశానికి స్వర్ణం అందించాడు. అలాగే షూటర్ అభినవ్ బింద్రా తర్వాత దేశంలో రెండవ వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా నిలిచాడు.
నీరజ్ చోప్రా మొదటి రౌండ్లోనే 87.03 మీటర్లు విసరగా, రెండో రౌండ్ లో 87.58 మీటర్లు, మూడో రౌండ్లో 76.79 మీటర్లు విసిరి అందరికంటే ఆధిక్యం కనబరచి తొలి స్థానంలో నిలిచాడు. నాలుగు, ఐదో రౌండ్లో పౌల్ అవగా, ఆరో రౌండ్లో 84.24 మీటర్లు విసిరాడు. ఈ ఫైనల్లో మొత్తం 12 మంది పాల్గొనగా, మూడు రౌండ్స్ అనంతరం నలుగురు ఎలిమినేట్ అవ్వడంతో మిగతా 8 మంది మరో మూడో రౌండ్స్ లో పాల్గొన్నారు. ఈ అందరి ప్రదర్శనలో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలోనే సాధించిన 87.58 మీటర్లే అత్యుత్తమంగా నిలవడంతో స్వర్ణం దక్కించుకున్నాడు.
నీరజ్ చోప్రా ఇప్పటికే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణాలు సాధించగా, తాజాగా ఒలింపిక్స్ స్వర్ణాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకం కోసం దేశం యొక్క 100 సంవత్సరాల నిరీక్షణను ముగించాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఏడు (ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య) పతకాలు సాధించింది. రియో ఒలింపిక్స్ లో భారత్ 6 పతకాలకే పరిమితం కాగా, టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలను దక్కించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ