ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ సహా రాబోయే పండుగ సీజన్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలపై కీలక ప్రసంగం చేశారు. లాక్ డౌన్ ముగిసినప్పటికీ కరోనా ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుందన్న సంగతి గుర్తుంచుకోవాలని ప్రజలను కోరారు. గత 7-8 నెలల్లో ప్రతి భారతీయుడు తనవంతుగా చేసిన ప్రయత్నాలతో దేశంలో కరోనా పరిస్థితి స్థిరంగా ఉందని, దాన్ని క్షీణించనివ్వకూడదని ప్రధాని మోదీ అన్నారు.
మాస్క్ లేకుండా బయటకొచ్చి మీ కుటుంబాలను ప్రమాదంలో పడేయవద్దు:
“ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు బాగుంది. మరణాల రేటు కూడా తక్కువగా ఉంది. భారతదేశంలో ప్రతి 10 లక్షల జనాభాలో 5,500 మందికి కరోనా వైరస్ సోకింది. అయితే అమెరికా మరియు బ్రెజిల్ వంటి దేశాలలో ప్రతి పదిలక్షల మందిలో 25,000 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. అలాగే దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకి 83 కరోనా మరణాలు నమోదవగా, అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్ వంటి దేశాలలో ఆ సంఖ్య 600 కంటే ఎక్కువుగా ఉంది” అని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల కాలంలో చాలా ఫోటోలు మరియు వీడియోలను చూస్తున్నాం. అక్కడ ప్రజలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండడం లేదని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇది సరైన విధానం కాదు. మాస్క్ లేదా పేస్ కవర్ లేకుండా బయటికి వస్తే మీరు మీ కుటుంబాలను కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. కరోనా తగ్గిందని నిర్లక్ష్యం వహించవద్దు. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు ఒకసారి బాగా తగ్గినప్పటికీ, అకస్మాత్తుగా మళ్ళీ పెరిగిన విషయాన్నీ అందరూ దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
వ్యాక్సిన్ రాగానే ప్రతి భారతీయుడికి అందుబాటులోకి:
దేశంలో కరోనా బాధితుల కోసం ప్రస్తుతం 90 లక్షలకు పైగా పడకల సౌకర్యం ఉంది. అలాగే 12,000 క్వారంటైన్ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 2000 కరోనా పరీక్షా ప్రయోగశాలలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య త్వరలో 10 కోట్లు దాటనుంది. కరోనాకి వ్యతిరేకంగా చేస్తున్న మన పోరాటంలో, పరీక్షల సంఖ్య పెరగడం బలంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి అన్ని దేశాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దేశంలో కొన్ని వ్యాక్సిన్స్ ఫేజ్-2 దశలో మరియు మరికొన్ని ఫేజ్-3 దశలో ఉన్నాయన్నారు.
అగ్ని, శత్రువును, వ్యాధిని ఎప్పుడూ తక్కువుగా చూడొద్దు. పండుగల సమయంలో అసలు నిర్లక్ష్యం వహించొద్దు. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ప్రజలంతా సురక్షితంగా ఉంటూ వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పండుగలు ప్రజల జీవితాలను మరింత ఉత్సాహవంతంగా మారుస్తాయని భావిస్తున్నాను. దయచేసి అందరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu