ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జర్మనీ, డెన్మార్క్ మరియు ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ రాజధాని బెర్లిన్ చేరుకున్నారు. బెర్లిన్లో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “బెర్లిన్ చేరుకున్నాను. ఈరోజు ఫెడరల్ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ ఓలాఫ్ స్కోల్జ్ తో చర్చలు జరుపుతాను. బిజినెస్ లీడర్స్ తో ఇంటరాక్ట్ అవడంతో పాటుగా కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రసంగించనున్నాను. ఈ పర్యటన భారత్, జర్మనీల మధ్య స్నేహాన్ని పెంపొందిస్తుందని విశ్వసిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా 2022లో ప్రధాని మోదీ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే.
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విధంగా, ఈ పర్యటనలో ముందుగా బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇద్దరు నేతలు ఇండియా-జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజిసి) ఆరవ ఎడిషన్కు సంయుక్తంగా అధ్యక్షత వహించనున్నారని తెలిపారు. ఇది ఛాన్సలర్ స్కోల్జ్తో ప్రధాని మోదీ యొక్క మొదటి ఐజిసి సమావేశమని, అలాగే డిసెంబర్ 2021లో అధికారం చేపట్టిన కొత్త జర్మన్ ప్రభుత్వంతో మొదటి ప్రభుత్వ సంప్రదింపులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మరియు ఛాన్సలర్ స్కోల్జ్ ఒక బిజినెస్ కార్యక్రమంలో సంయుక్తంగా ప్రసంగిస్తారన్నారు. అలాగే ప్రధాని జర్మనీలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించి, వారితో సంభాషిస్తారని తెలిపారు.
జర్మనీ పర్యటన అనంతరం డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడరిక్సెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అధికారిక పర్యటనపై కోపెన్హాగన్కు వెళతారని, డెన్మార్క్ వేదికగా జరుగుతున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్లో కూడా పాల్గొంటారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్లో పాల్గొని, ప్రవాస భారతీయ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఇక మే 4న తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ కొద్దిసేపు పారిస్లో ఆగి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో సమావేశం అవుతారని చెప్పారు. భారత్ మరియు ఫ్రాన్స్ ఈ సంవత్సరం వారి మధ్య దౌత్య సంబంధాల 75 సంవత్సరాన్ని జరుపుకుంటున్నాయని, ఇద్దరు నాయకుల మధ్య జరిగే ఈ సమావేశం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంకు సంబంధించి మరింత ప్రతిష్టాత్మక ఎజెండాను ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ