భారతదేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జూలై 18న (సోమవారం) భారతదేశం యొక్క తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి సర్వం సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు, సాధారణ ఎన్నికలకు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికలలో పార్లమెంటుకు ఎన్నికైన ఎగువ, దిగువ సభల సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులు పాల్గొననున్నారు. దామాషా ప్రాతినిధ్య విధానం ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన ఎంపీలు మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులు ఉంటారు. అయితే నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత లేదు. రాష్ట్రపతిని బ్యాలెట్ పద్దతిలో ప్రజాప్రతినిధులే ఎన్నుకోనుండగా అన్ని రాష్ట్ర అసెంబ్లీల లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఓటు వేయడం కోసం వేర్వేరు రంగుల బ్యాలెట్ పేపర్లు కేటాయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటును గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు పింక్ రంగులతో కూడిన బ్యాలెట్ పేపర్లు రాష్ట్రాల అసెంబ్లీలకు చేరుకున్నాయి. ఈసారి ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 కాగా, ఎమ్మెల్యే ఓటు విలువ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ లేకపోవడంతో ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువ 708 నుండి 700కి పడిపోయింది. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో నిలవగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా నిలవడం తెలిసందే. జూలై 21వ తేదీన పార్లమెంట్ హౌస్లో కౌంటింగ్ జరుగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ