భారత్ లో ఇప్పటికే రెండు కరోనా వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలో అత్యవసర వినియోగానికి సంబంధించి మరో వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ను ఉపయోగించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ సోమవారం నాడు ఆమోదం తెలిపింది. ఇక నిపుణుల కమిటీ సిఫార్సులకు డీసీజీఐ కూడా ఆమోదముద్ర వేస్తే స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది.
రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను దేశంలో ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడో పేజ్ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ యొక్క అత్యవసర ఉపయోగం కోసం ఇటీవలే డాక్టర్ రెడ్డీస్ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే పరిశీలన అనంతరం ఈ వ్యాక్సిన్ వినియోగ అనుమతి కోసం డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ పూర్తి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. త్వరలో ఈ జాబితాలో స్పుత్నిక్-వి కూడా చేరనుంది. ఓవైపు రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవడం, కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటుండడంతో దేశంలో మరో ఐదు కరోనా వ్యాక్సిన్ లు వినియోగంలోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ