శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28, గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చేసిన కొన్ని గంటల్లోనే ఉద్ధవ్ థాకరే తొలి కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. సహ్యాద్రి అతిథి గృహంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశానికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయి, కాంగ్రెస్ కు చెందిన బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్ మరియు ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్, ఛగన్ బుజ్బల్ హాజరయ్యారు. అలాగే ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ కూడా ఈ సందర్భంగా సహ్యాద్రి గెస్ట్హౌజ్కు రావడం విశేషం.
కేబినెట్ సమావేశం తరువాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ రాజధాని అయినా రాయ్గడ్ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ లో మొదటి నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తుందని, ఎవరికీ భయం లేని వాతావరణాన్ని సృష్టిస్తుందని అన్నారు. అలాగే మహారాష్ట్రలోని సామాన్య ప్రజల కోసం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మహారాష్ట్ర రైతులకు సాధ్యమైనంత త్వరగా మంచి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రెండు రోజుల్లో రైతుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలపై పూర్తి సమాచారం అందించాలని అధికారులను కోరానని, అన్ని వివరాలు పరిశీలించాక రైతులకు అందించే సహాయంపై నిర్ణయం తీసుకుంటానని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. మరో వైపు శివసేన నాయకుడు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, నవంబర్ 30న అసెంబ్లీలో బల నిరూపణ చేసే అవకాశముందని తెలిపారు. ఇంతకుముందు మహా వికాస్ అఘాడి కూటమికి 162 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడుఆ సంఖ్య 170కు చేరుకుందని చెప్పారు.
[subscribe]