తెలంగాణ రాష్టంపై ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం పీయూష్ గోయల్తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, తెరాస ఎంపీలు పార్లమెంట్లో గోయల్ను కలిశారు. తెలంగాణాలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పీయూష్ గోయల్ను వారు కోరారు. ఈ సందర్భంగా.. తెలంగాణ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని, తెలంగాణ రైతులకు బాసటగా ఉంటామని గోయల్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం గోయల్ ఈ విషయంపై వివరించేందుకు మీడియా సమావేశం నిర్వహించారు.
మీడియా సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి కూడా ముడి బియ్యం సేకరణ చేస్తున్నామని అన్నారు. అయితే, అన్ని రాష్ట్రాలు ముడి బియ్యం ఎంత ఇస్తాయో చెప్పాయని, తెలంగాణ రాష్ట్రం మాత్రం దీనిపై సరైన లెక్క చెప్పటం లేదని అన్నారు. కేంద్రం ఎన్నిసార్లు ప్రశ్నించినా.. దీనిపై తెలంగాణ నుంచి సమాధానం లేదని, తాము మాత్రం ఏం చేస్తామని ప్రశ్నించారు. ఒప్పందం ప్రకారమే ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ముడి బియ్యం ఎంత ఇచ్చినా కొంటామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25న అన్ని రాష్ట్రాలతో సమావేశమయ్యామని, ఏపీ కూడా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తామని చెప్పిందని వెల్లడించారు. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి వరి సేకరణ చేస్తున్నామని గోయల్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ