కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో విధించిన లాక్డౌన్, అన్లాక్ 2.0 విధివిధానాల గడువు జూలై 31 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్లాక్ 3.0 మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాగా అన్లాక్ 3.0 లో భాగంగా దేశవ్యాప్తంగా థియేటర్లు, జిమ్స్, ఇతర కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా థియేటర్స్ ప్రారంభానికి సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆగస్టు 1 లేదా ఆగస్టు 31 నుంచి థియేటర్స్ ప్రారంభించాలని సిఫారసు చేయగా, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.
థియేటర్స్ యాజమాన్యాలు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా 25 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్స్ ప్రారంభానికి అనుమతి ఇచ్చేందుకు కేంద్రం యోచిస్తునట్టుగా తెలుస్తుంది. మరోవైపు మెట్రో రైళ్లు, స్కూళ్లు, బహిరంగ సమావేశాలు, ఇతర సేవలపై లాక్డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అన్లాక్ 3.0 కు సంబంధించి పూర్తి వివరాలను కేంద్రం త్వరలో ప్రకటించనుండగా, పలు అంశాలపై పూర్తి స్పష్టత రానుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu