ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 114 మంది మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య సమాచారం, తప్పుడు వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని అరికట్టే దిశగా “వాట్సప్” కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతికూల సమయంలో ఫార్వర్డ్ మెసేజ్ లిమిట్ను తగ్గిస్తూ వాట్సప్ నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సప్ ద్వారా ఒకరికంటే ఎక్కువ మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేయలేని విధంగా ఆంక్షలు తీసుకొచ్చింది.
ఇప్పటివరకు వాట్సప్ లో ఒక మెసేజ్, ఫోటో లేదా వీడియోను ఐదుగురికి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండేది. ముందుగా అసలు వాట్సప్ లో ఫార్వర్డ్ మెసేజెస్కు ఎలాంటి లిమిట్ ఉండేది కాదు. కానీ ఈ మాధ్యమం ద్వారా ఫేక్ న్యూస్ ఎక్కువుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫార్వర్డ్ మెసేజ్ లిమిట్ను ఐదుగురికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో ఫేక్ న్యూస్ కట్టడికి కోసం మెసేజ్ ఫార్వర్డ్ లిమిట్ ను ఒక్కరికే పరిమితం చేస్తూ వాట్సప్ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఇటీవలే ఫార్వర్డ్ మెసేజ్ను వినియోగదారులు ఆన్లైన్లో వెరిఫై చేసే ఫీచర్ను వాట్సప్ అందుబాటులోకి తెచ్చింది. ఆ మెసేజ్ లపై మాగ్నిఫయింగ్ గ్లాస్ బొమ్మ ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ అప్ డేట్ అందరికి అందుబాటులోకి రానుంది. ఇవే గాక ఫేక్ న్యూస్ను ప్రచారాన్ని అడ్డుకోవడానికి వాట్సప్ ఇలాంటి అనేక ఫీచర్స్ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
WhatsApp’s new limit on frequently forwarded messages aimed at combating spread of fake news, misinformation amid COVID-19 pandemic
— Press Trust of India (@PTI_News) April 7, 2020