తెలంగాణలో జరిగిన శాససనభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితమైన బీజేపీ..త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. దీనికోసం పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి కసరత్తులు చేస్తోంది. రానున్న తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలను ఎలా అయినా రాబట్టడంపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను సంక్రాంతి పండుగ తరువాత రూపొందించనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలలో గతంలో కంటే కాస్త మెరుగైన ఫలితాలను తెలంగాణ ఓటర్లు ఇవ్వడంతో లోక్ సభ ఎన్నికలలోనూ అదే జోరును కంటెన్యూ చేసి బలంగా పాతుకుపోవాలని ఆలోచిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో.. తెలంగాణ నుంచి 17 స్థానాల్లో సభ్యులను పోటీలో దింపడానికి భారతీయ జనతా పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈసారి తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇప్పటికే కిషన్రెడ్డి, సంజయ్, అరవింద్ను వారి సిట్టింగ్ స్థానాల నుంచి మళ్లీ కొనసాగించడానికి పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బండి సంజయ్, అరవింద్, బాబురావు ముగ్గురూ కూడా ఓడిపోయారు. ప్రస్తుతం బండి సంజయ్, అరవింద్ పోటీ చేసే లోక్ సభ స్థానాల్లో ఇతర పోటీదారుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో వీరికి సిట్టింగ్ స్థానాల నుంచి మళ్లీ కొనసాగడానికి అధిష్టానం ఓకే చెప్పేసింది.
కానీ, బీఆర్ఎస్ నాయకుడు రాథోడ్ బాబు, టీటీడీపీ నాయకుడు రమేష్ రాథోడ్ ఇద్దరూ కూడా ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కె. రఘునందన్రావు, పి. మురళీధర్రావు, డీకే అరుణ, పి. జితేందర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బూర నరసయ్యగౌడ్ వంటి నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.
మరోవైపు ఈటల రాజేందర్ మెదక్ లేదా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగనున్నారని వార్తలొస్తున్నాయి. అయితే మెదక్ టికెట్ రఘునందన్ రావు ఆశిస్తుంటే.. మల్కాజ్గిరి టికెట్ మురళీధర్ రావుతో పాటు మరికొందరు సీనియర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈటల ఎంత ప్రయత్నించినప్పటికీ టికెట్ దక్కకపోవచ్చని అంచనాలతో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆయనకు కాంగ్రెస్ నుంచి బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చిందని.. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లిపోతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ