తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 23, సోమవారం నాడు చిక్కడపల్లి సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర భూముల/ఆస్తుల రిజిస్ట్రేషన్ ను ప్రారంభించనున్నారు. నూతన రెవెన్యూ విధానంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు మ్యుటేషన్లు ప్రారంభమయ్యాయి. తాజాగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్, మ్యుటేషన్లకు కూడా రంగం సిద్ధమైంది.
ఇందుకోసం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో అమ్మేవారు, కొనే వారు, సాక్షులు కూడా తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఫీజు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ 10 నిమిషాల్లోనే పూర్తికానుంది. సోమవారం నుండి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అధికారికంగా ప్రారంభమవుతుండగా, పనితీరు పరిశీలన కోసం ధరణి పోర్టల్ లో ముందుగా శాంపిల్ రిజిస్ట్రేషన్లు చేపడుతున్నటుగా అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ