తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) తమ అభ్యర్థుల పేర్లను బుధవారం నాడు ప్రకటించింది. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటెరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పేర్లను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం వీరు ముగ్గురు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి, తమకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ బీ-ఫారాలను కూడా అందజేశారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ ల యొక్క పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుంది. ఈ 2 స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికల పక్రియ జరుగనుందని ఈసీ ప్రకటించింది. ఈ స్థానాలకు అభ్యర్థులుగా దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ పార్థసారథి రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మే 24న ప్రారంభమ కానుండగా, తుదిగడువు మే 31గా నిర్ణయించారు.
మరోవైపు ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఏప్రిల్ 2, 2024 వరకు ఉన్న తన రాజ్యసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ప్రస్తుతం ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ స్థానానికి మే 30వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. బండ ప్రకాష్ స్థానంలో ఈ స్థానానికి వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ఉప ఎన్నికకు రేపటితో (మే 19) నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుండటంతో గాయత్రి రవి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ బలాన్ని పరిగణిస్తే ఈ మూడు స్థానాలను కూడా ఎలాంటి పోటీ లేకుండా పార్టీ అభ్యర్థులే దక్కించుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF