స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్వాతంత్య్రదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. బందోబస్తు ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజానికానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు.
గోల్కొండ కోటలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆర్ అండ్ బి అధికారులను కోరారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని మాస్క్ లు, శానిటైజర్ లను సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉంచాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వసంపదను ప్రతిభింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి కళాబృందాలను సమీకరించాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో టి ఆర్అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, అడిషనల్ డిజి జితేందర్, కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఎనర్జీ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ