టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారం నాడు ముగిశాయి. జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23న ప్రారంభమైన ఒలింపిక్స్ క్రీడలు 17 రోజుల పాటుగా ప్రపంచానికి అద్భుతమైన కనువిందు అందించాయి. ఈ 32వ ఒలింపిక్స్ ముగింపు వేడుకలను జపాన్ రాజధాని టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. అద్భుతమైన బాణాసంచా వెలుగులుతో, విన్యాసాలు, అథ్లెట్ల సందడితో ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంతటి విశ్వ క్రీడలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడంతో ఒలింపిక్స్ చరిత్రలోనే టోక్యో ఒలింపిక్స్ ప్రత్యేక గుర్తింపు సాధించింది.
కరోనా ప్రోటోకాల్స్ కు అనుగుణంగా ముగింపు వేడుకలు కూడా ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలోనే నిర్వహించబడ్డాయి. ఈ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ బజరంగ్ పునియా ముగింపు వేడుకలో భారత జెండాని పట్టుకుని, భారత బృందాన్ని బయటకు నడిపించాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బేచ్, జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో మరియు జపాన్ ప్రధాన మంత్రి యోషిహిడే సుగాతో పాటుగా పలువురు ప్రముఖులు ఈ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. టోక్యో గవర్నర్ యురికో కోయికే ఒలింపిక్స్ జెండాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బేచ్ కు అందజేయగా, అతను దానిని పారిస్ మేయర్ హిడాల్గోకు అందించడంతో ఈ విశ్వక్రీడ సంబంరం ముగిసింది. 2024లో ఒలింపిక్స్ పారిస్ లో జరగనున్నాయి.
48వ స్థానంలో నిలిచిన భారత్ :
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ లో భారత్ కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పతకాలలో అగ్రస్థానంలో నిలిచింది. 39 స్వర్ణం, 41 రజత, 33 కాంస్య పతకాలుతో మొత్తం 113 పతకాలు సాధించి అమెరికా ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఆతర్వాత చైనా 88 పతకాలతో (38 స్వర్ణం, 32 రజత, 18 కాంస్య) రెండవ స్థానంలో ఉంది. 71 పతకాలతో (20 స్వర్ణం, 28 రజత, 23 కాంస్య) రష్యన్ ఒలింపిక్ కమిటీ అత్యధిక పతకాల్లో మూడవస్థానంలో నిలిచింది. అయితే అమెరికా, చైనా అనంతరం అత్యధికంగా జపాన్ 27, గ్రేట్ బ్రిటన్ 22 స్వర్ణ పతకాలు గెలిచి ముందువరుసలో ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ