ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారి భద్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్లు, ఆస్పత్రులు, ట్రామా కేర్ సెంటర్ల మ్యాపింగ్పై సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించడం, గోల్డెన్ అవర్లో వైద్యసాయం అందించదానికి అంబులెన్స్ సేవలు, ఆసుపత్రులు, ట్రామా కేర్ సెంటర్ల ద్వారా అత్యవసర వైద్యసేవలు అందించే నిమిత్తం రూపొందించిన యూనిఫైడ్ యాక్షన్ ప్లాన్ ను సీఎస్ సమీక్షించారు. ట్రామా కేర్ సెంటర్లలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు నిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ద్వారా శిక్షణ అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రమాదాల సందర్భంగా క్షతగాత్రుల మరణాల సంఖ్యను తగ్గించే నిమిత్తం ఈఎంఆర్ఐ ద్వారా అందించే ఆక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్పై మాస్టర్ శిక్షణ కోసం వైద్య శాఖ సిబ్బందిని గుర్తించాలన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గింపునకు సంబంధించి ఫెన్సింగ్, క్రాసింగ్స్, సైనేజెస్, విద్యుద్దీకరణ, ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలలో ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా వేగ నియంత్రణ, పర్యవేక్షణ తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి ఒక టీం ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ డ్రైవర్లకు సేఫ్ డ్రైవింగ్, వాహనాల మెయింటెనెన్స్ ఒకరోజు శిక్షణ అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, అడిషనల్ డిజి (లా అండ్ ఆర్డర్) జితేందర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, సందీప్ శాండిల్య, రవాణా శాఖ కమీషనర్ యంఆర్యం రావు, బీ విజేంద్రా, ప్రత్యేక కార్యదర్శి టీఆర్ అండ్ బి, సంతోష్ పిడి, ఓఆర్ఆర్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ