32 రోజుల్లో.. 96 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు సీఎం కేసీఆర్. డెబ్బై ఏళ్ల వయస్సులో కూడా ఏ మాత్రం తగ్గకుండా.. నవ యువకుడిలా పోరాడారు. తన గెలుపుతో పాటు.. తమ అభ్యర్థుల గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి.. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు కదిలారు. ప్రతిసారిలానే ఈసారి కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్.. 32 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి గజ్వేల్లో ప్రచారం ముగించారు.
హుస్నాబాద్ నియోజకవర్గం కేసీఆర్కు సెంటిమెంట్. 2014, 2018 ఎన్నికలప్పుడు కూడా ఈ నియోజకవర్గం నుంచే కేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో.. కేసీఆర్ సెంటిమెంట్ మరింత బలపడింది. అందుకే ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. అలా ప్రచారం ముగిసే సమయానికి వందకు పైగా నియోజకవర్గాల్లో పర్యటించారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని పోయారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకొని వెళ్లారు.
ఈసారి కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్ గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ సభతోనే ప్రచారం ముగించారు. అయితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించిన కేసీఆర్.. హైదరాబాద్లో మాత్రం నిర్వహించలేదు.
ఇక ప్రచారంలో భాగంగా ప్రత్యర్ధులను కేసీఆర్ ఎండగట్టారు. జాతీయ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోయినసారి ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. అయితే ఈసారి మాత్రం ఎక్కడా కూడా ఆయన పేరు ఎత్తలేదు. అటు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ మాట కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే ఎక్కడా చంద్రబాబు, జనసేనాని పేరు ఎత్తలేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
అటు కేసీఆర్కి దైవభక్తి కూడా ఎక్కువే. 2014లో ఎన్నికలకు వెళ్లేముందు కేసీఆర్ చండీయాగం నిర్వహించారు. 2018 ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ రెండు ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఘనం విజయం సాధించారు. అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఈసారి కూడా అదే సెంటిమెంట్తో కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం చేశారు. ఇలా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం గులాబీ బాస్ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మరి కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..? యాగాలు ఫలిస్తాయా..? ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ