ప్రస్తుత కరోనా ప్రతికూల సమయంలో మనమంతా సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం, మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దామని, కరోనా మృతులకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దామని చెప్పారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ రావడంతో జూలై 27, సోమవారం ఉదయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మంత్రికి కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. తాను ముందుగానే చెప్పినట్లు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచిన తన అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరికీ మంత్రి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కరోనా వైరస్ సామాజిక సమస్యగా పరిణమించిందన్నారు. ఈ సమస్యకు ఓ పరిష్కారం లేకపోవడం, మందులు రాకపోవడం ఓ విచిత్రమై విపరీతంగా మారిందని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇందుకు మనం, మన దేశం, రాష్ట్రం ఎవరూ అతీతులం కాదని మంత్రి చెప్పారు. స్వీయ నియంత్రణ పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతని, పరిసరాల పారిశుద్ద్యాన్ని సమర్జతవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే మాస్కులను ధరించడం, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళకుండా ఉండటం చేయాలని చెప్పారు. ప్రజలు కూడా ఆందోళన చెందొద్దని, కాస్త సంయమనంతో వ్యవహరించాలన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉందని, కరోనా వైరస్ బాధితుల కోసం అవసరమైన మందులు, పరికరాలు, పరీక్షలు కిట్లు, వైద్య నిర్వహణకు అవసరమైన ఇతర సదుపాయాలు సిద్జంగా ఉన్నాయన్నారు. అనుమానంగా ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలని, తగు రీతిలో క్వారంటైన్ లో ఉండాలని, కరోనా కట్టడి అయ్యే వరకు ప్రజలు మరికొద్ది కాలం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu