యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా యూకే నుంచి రాష్ట్రాలకు చేరుకున్న ప్రయాణకుల వివరాలను ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖలు ట్రాక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పరిణామాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై చర్చించేందుకు కరోనా నిపుణుల కమిటీతో ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. రెండవ దశ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.
మరోవైపు గత రెండు రోజులుగా యునైటెడ్ కింగ్డమ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దాదాపు 1,200 మంది ప్రయాణికులను ట్రాక్ చేసినట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ 9 నుండి 1,200 మంది ప్రయాణికులు రాష్ట్రంలోకి వచ్చారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో ఎవరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వలేదు. అయినప్పటికీ ప్రయాణికులందరినీ గుర్తించి వారికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ట్రాకింగ్ విషయంలో ప్రయాణికులు సహకరించాలని కోరారు. కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ