తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం వేములవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మరియు పలువురు అధికారులు, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్.. రూ. 52 కోట్లతో చేపట్టనున్న రహదారుల పునరుద్ధరణ పనుల శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అలాగే మరో రూ. 20 కోట్లతో స్టేడియం మరియు సినారె కళామందిరం పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం రుద్రంగిలో 3.50 కోట్లతో నిర్మించిన కస్తూర్బా పాఠశాలా (కేజీబీవీ) భవనం ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు నక్సలిజానికి, తీవ్రవాదానికి అడ్డాగా ఉన్న ఈ ప్రాంతం నేడు అభివృద్గి చెంది అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మారుమూల గ్రామాల్లో సైతం నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, మన ఊరు-మన బడి పథకం కింద కోట్ల రూపాయల నిధులు కేటాయించి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా వీటిని తయారు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రమేష్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించుకునేందుకు పదే పదే వినతి పత్రాలు ఇస్తుంటారని, అధికారుల వెంటపడి పనులు చేయించుకుంటారని అన్నారు. ఇక తమది చిన్న ప్రభుత్వమని, తమ వద్దనున్న పరిమిత నిధులతో ఇక్కడ 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని, అయితే పెద్ద పెద్ద మాటలు చెబుతున్న బీజేపీ నాయకులు కేంద్రంలో తమ పార్టీయే ఉన్నందున చేతనైతే 100 పడకల ఆస్పత్రి పెట్టించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ