తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఖమ్మం జిల్లాలో టీటీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తోన్న పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. దీనికోసం ముందుగా చంద్రబాబు బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరి, 9.30 గంటలకు రసూల్పుర వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అక్కడినుంచి 9.45 గంటలకు ఈశ్వరీబాయి విగ్రహం కూడలి నుంచి హబ్సిగూడ, ఉప్పల్ చౌరస్తా, ఎల్బినగర్, హయత్నగర్ బస్ డిపో, పెద్ద అంబర్పేట, రామోజీఫిలిం సిటి, కొత్తగూడ, చౌటుప్పల్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు టేకుమెట్లకు చేరుకుంటారు.
అక్కడ లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు నాయకం గూడెం మీదుగా కూసుమంచి చేరుకుంటారు. 2:30 నిమిషాలకు కేశవాపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం చేరుకుని మయూరి జంక్షన్ నుంచి పార్టీ నేతలతో పాటు ర్యాలీగా సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా చంద్రబాబు టీడీపీలో చేరికలకు ఆహ్వానం పలుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రసంగం అనంతరం రాత్రి 7.30 గంటలకు స్టేడియం నుండి బయలుదేరి వెంకటయ్య పాలెం మీదుగా రాత్రి 8 గం.లకు చింతకానికి చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు పాతర్లపాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తారు.
ఇక చివరిగా రాత్రి 9.15 గంటలకు పాతర్లపాడు నుంచి బయలుదేరి విజయవాడ హైవే మీదుగా ఉండవల్లి నివాసానికి చేరకుంటారు. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణలో చంద్రబాబు పర్యటన ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల తర్వాత మూడేళ్లపాటు తెలంగాణలో పెద్దగా క్రియాశీలంగా లేని చంద్రబాబు, మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో పర్యటించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణాలో ఉనికిని చాటడానికి టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే టీడీపీకి మంచి పట్టున్న ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటనను వారు సోదాహరణగా చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ