నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ/ట్రిపుల్ ఐటీలో శనివారం జరిగిన ఐదవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ, దేవాదాయ శాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను మంత్రులు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యా వ్యవస్థ/ఎకో సిస్టమ్ ను పటిష్టపరుస్తుందని, సమీప భవిష్యత్తులో అపారమైన అవకాశాలను అందించే 3డీలు అయిన డిజిటైజేషన్, డీకార్బనైజేషన్ మరియు డీసెంట్రలైజేషన్ పై దృష్టి పెట్టాలని గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
ప్రాక్టీస్ స్కూల్ లేదా అప్రెంటిస్షిప్ మోడల్ ను ప్రవేశపెట్టాలని, తద్వారా విద్యార్థులు చదువుతున్నప్పుడే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ పొందుతారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. విద్యార్థులు ఒక ఆలోచనతో నడవడానికి మరియు ఉత్పత్తితో బయటకు వెళ్లడానికి టీ హబ్ హైదరాబాద్, రెసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ హైదరాబాద్ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరారు. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని మంత్రి పేర్కొన్నారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు.
ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థులకు డెస్క్టాప్లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని చెప్పారు. టీహబ్తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి మనం ఎదగాలని చెప్పారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆర్జీయూకేటీ, బాసరకు మిషన్ భగీరధ నీళ్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు, అలాగే సైన్స్ బ్లాక్ ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంపస్లో 10 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అభినందించారు. ఇక ట్రిపుల్ ఐటీకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని మంత్రి కేటీఆర్ విద్యార్థులతో పేర్కొన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్:
సెప్టెంబరు, 2022లో బాసర ఆర్జీయూకేటీకి వచ్చిన సందర్భంగా ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు అందిస్తామని విద్యార్థులకు చేసిన వాగ్దానం మేరకు మంత్రి కేటీఆర్ ఈరోజు బాసర ట్రిపుల్ ఐటీ ఐదవ స్నాతకోత్సవంలో తన సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లతో కలిసి లాంఛనంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, పీ1, పీ2 విద్యార్థులకు డెస్క్ టాప్ లు అందజేశారు. మొత్తం 2,200 ల్యాప్ టాప్ లు మరియు 1,500 డెస్క్ టాప్ కంప్యూటర్లును ఇందుకోసం సిద్ధంచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE