భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడారు. ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్ లతో 210 పరుగులు చేయగా, కింగ్ కోహ్లీ 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 113 పరుగులు చేశాడు. వన్డేల్లో భారత్ తరపున డబుల్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా, అంతర్జాతీయంగా ఎనిమిదో ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. ఇషాన్ కిషన్ కంటే ముందు వన్డేల్లో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ (3 సార్లు), వీరేంద్ర సెహ్వాగ్, ఎంజే గుప్తిల్, క్రిస్ గేల్, ఫకర్ జామన్ మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ముందుగా మూడో వన్డేలో టాస్ ఓడిన భారత్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (3), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (8), వాషింగ్టన్ సుందర్ (20), అక్షర్ పటేల్ (20), శార్దూల్ ఠాకూర్ (3), కుల్దీప్ యాదవ్ (3*) తక్కువ పరుగులే చేయగా, ఇషాన్ కిషన్ (210), విరాట్ కోహ్లీ (113) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించి బంగ్లాదేశ్ ముందు 410 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షకీబ్ హల్ హాసన్ 2, ఎబాడట్ హుస్సేన్ 2, ముస్తాఫిజర్, మెహిదీ హాసన్ మిరాజ్ చెరొక వికెట్ తీశారు.
ఈ వన్డేలో విశేషాలు:
- వన్డే క్రికెట్లో ఇషాన్ కిషన్ అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేశాడు.
- కేవలం 126 బంతుల్లోనే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. క్రిస్ గేల్ 138 బంతుల్లో, వీరేంద్ర సెహ్వాగ్ 140 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు.
- ముందుగా ఇషాన్ కిషన్ 85 బంతుల్లో సెంచరీ చేసి, తొలి వన్డే సెంచరీ నమోదు చేసుకోగా, తర్వాత 41 బంతుల్లోనే మరో 100 పరుగులు చేసి తోలి డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. డబుల్ సెంచరీ చేసిన 4వ భారత ఆటగాడిగా నిలిచాడు.
- ఇషాన్ కిషన్ వన్డేల్లో బంగ్లాదేశ్పై అత్యధిక వ్యక్తిగత పరుగులు మరియు భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
- వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత లెఫ్ట్ హ్యాండర్గా ఇషాన్ కిషన్ నిలిచాడు.
- ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడుగా ఇషాన్ కిషన్ గుర్తింపు పొందాడు.
- విరాట్ కోహ్లీ తన 44వ వన్డే సెంచరీని, మొత్తంగా తన 72వ ఇంటర్నేషనల్ సెంచరీని నమోదు చేశాడు. కాగా వన్డేల్లో 40 నెలల వ్యవధి తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు.
- దీంతో అత్యధిక సెంచరీలో రికి పాంటింగ్ (71) ను అధిగమించి, సచిన్ టెండూల్కర్ (100) తర్వాత కోహ్లీ (72) రెండో స్థానంలో నిలిచాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE