ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తం అయిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్, బన్సీలాల్ పేట లోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లలో ప్రభుత్వం ఉచితంగా అందించే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగలలో బతుకమ్మ ఒకటని అన్నారు. ఈ బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉద్దేశం అన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే 2017 సంవత్సరం నుండి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా కోటి 8 లక్షల చీరలను 333 కోట్ల రూపాయల ఖర్చుతో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి లేక తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో చీరల తయారీని చేనేత కార్మికులకే అప్పగించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. క్రిస్మస్ దుస్తులు, రంజాన్ కు దుస్తులు, ఇప్తార్ విందుల నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని చాటి చెప్పే పండుగలను ఘనంగా నిర్వహించడం ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్, బన్సీలాల్ పేట కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, కుర్మ లక్ష్మి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీలు వంశీ, ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ