హైదరాబాద్ నగర శివారు చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరియు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 36 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చౌటుప్పల్ ఆస్పత్రితో పాటు నియోజకవర్గంలోని మరో 4 పీహెచ్సీలను అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఇక చౌటుప్పల్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చడం ద్వారా సమీప ప్రాంతాలైన సంస్థాన్ నారాయణపురం, వలిగొండ, భూదాన్పోచంపల్లి, చిట్యాల, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాల ప్రజలకు 24 గంటల వైద్య సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.
ఇంకా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాగా ఈ ఆస్పత్రిలో ప్రతి నిత్యం సుమారు 300 మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారని, నెలకు సుమారు 50 వరకు ప్రసవాలు కూడా జరుగుతున్నాయని, ఇవేకాకుండా సమీపంలోని 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సైతం ఇక్కడ చికిత్స అందిస్తుంటారని తెలిపారు. ఇక ప్రస్తుతం ఇక్కడ ఐదుగురు వైద్యులు, 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, త్వరలో వంద పడకల ఆస్పత్రిగా మారనున్న క్రమంలో మరో 20 మందికి పైగా వైద్యులు ఇక్కడకు రానున్నారని తెలిపారు. అలాగే జనరల్ సర్జన్తో పాటు చిన్న పిల్లలకు, చెవు, ముక్కు, గొంతు, ఎముకలు, అనస్తీషియా, గైనకాలజీ వంటి ప్రత్యేక విభాగాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. కాగా గతంలో మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సమయంలో చండూరు బహిరంగ సభలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరగా.. ఆయన అభ్యర్థన మేరకు వంద పడకలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE