తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, జూన్ 30 నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 30న గోల్కొండ బోనాలు, జులై 17న సికింద్రాబాద్, 24 వ తేదీన హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం 15 కోట్లు మంజూరు:
గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా బోనాలను ఘనంగా జరుపుకోలేకపోయినట్లు చెప్పారు. ఈ సంవత్సరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. జీహెఛ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
భక్తుల కోసం వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంకా ఏమైనా ప్రభుత్వ పరమైన ఏర్పాట్లు అవసరమైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తా, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి, ఆర్ అండ్ బీ సెక్రెటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బేతి సుభాష్ రెడ్డి, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్, కలెక్టర్ లు శర్మన్, అమయ్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, పోలీసు కమిషనర్ లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం, అంబర్ పేట మహంకాళి దేవాలయం, గోల్కొండ దేవాలయం, ఉమ్మడి దేవాలయాలు తదితర దేవాలయాల కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవాల నిర్వహకులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY