హిందుపురం శాసనసభ్యుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ 61వ జన్మ దినోత్సవ వేడుకలు నేడు హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆవరణలో క్యాన్సర్ పై పోరాడుతున్న పలువురు రోగులు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా హాస్పిటల్ కు చేరుకొన్న బాలకృష్ణకు అభిమానులు, హాస్పిటల్ సిబ్బంది స్వాగతం పలికారు. ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న స్వర్గీయ నందమూరి బసవతారక రామారావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం క్యాన్సర్ తో పోరాడుతున్న రోగులకు పండ్లు, చిన్నారులకు బహుమతులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను బాలకృష్ణ ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా తన దృష్టికి తెచ్చిన సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి సూచనలు చేశారు. తర్వాత హాస్పిటల్ లో పని చేస్తున్న హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి ఏర్పాటు చేసిన ఈ కాన్సర్ ఆసుపత్రి ఎందరో క్యాన్సర్ రోగులకు చుక్కానిగా నిలిచిందని అన్నారు. త్వరలోనే ఆంద్ర ప్రదేశ్ లోని అమరావతి ప్రాంతంలో హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం కానుందని వెల్లడించారు. హాస్పిటల్ స్థాపన సమయంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు నిర్థేశించిన లక్ష్యాలకు అనుగుణంగా దేశం లోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ హాస్పిటల్ గా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ని నిలబెట్టడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా హాస్పిటల్ స్థాపనలోనూ, నిర్వహణలోనూ సహాయం అందిస్తున్న పలువురు దాతలకు, అందులోనూ ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టిన రోజు తనపై అభిమానులు, ఇతరులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు వయస్సు పెరిగినా నానాటికీ తగ్గిపోతున్న భావన ఏర్పడుతుందని బాలకృష్ణ అన్నారు.
ధైర్యంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి:
ఇక కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరాటానికి వ్యాక్సిన్ వేయించుకోవడం కీలకమని అంటూ తాను ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకొన్నానని, అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటూ కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని బాలకృష్ణ సూచించారు. అనంతరం పలువురు దాతలు క్యాన్సర్ హాస్పిటల్ కు అందజేసిన పలు విరాళాలాలను బాలకృష్ణ వారి వద్ద నుంచి స్వీకరించారు. ఇలా విరాళాలు ఇచ్చిన వారిలో బాలకృష్ణ అభిమానులు నిర్వహించే బాలయ్య.కామ్ తరపున సేకరించిన 2,22,222 రూపాయలు, సీతారామ రాజు లక్షరూపాయలు, అబ్బూరి శేఖర్ లక్ష రూపాయలు వంటి వారు ఉన్నారు. వీరితో పాటూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రోగులకు అందించే ఉచిత భోజన సదుపాయం కోసం రుద్రరాజు శ్రీ రామరాజు మరియు వారి కుటుంబ సభ్యులు 14.40 లక్షల రూపాయాల విరాళాన్ని అందజేశారు. అలాగే విశాఖ జిల్లా నర్సీపట్నం కు చెందిన స్టార్ ఫౌండేషన్ కు చెందిన రాదాకృష్ణ మూడు ఆక్సిజన్ కాన్సేంటేటర్స్ ను హాస్పిటల్ కు బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ