తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ఇప్పటి వరకు 6,798 కొనుగోలు కేంద్రాలకు గాను 4,485 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో పాటు ధాన్యం కొనగోళ్లకు సంబంధం ఉన్న విభాగాలతో కేంద్ర కార్యాలయం నుండి తనతో పాటు కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,211 కోట్ల విలువ చేసే 6.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ కొనుగోళ్ల ప్రక్రియ నిలిపివేయకూడదని అధికారులను ఆదేశించారు. తాలు, తరుగు సమస్య రాకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రేషన్ డీలర్ల గన్నీ సంచుల ధర పెంపు:
అలాగే రేషన్ డీలర్లు పౌరసరఫరాల సంస్థకు పంపిణీ చేసే గన్నీ సంచుల ధరను ఒక్కో సంచి ధరను రూ.18 నుండి రూ.21 కి పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారంనాడు జరిగిన పౌరసరఫరాల సంస్థ 26 బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 1వ తేదీ నుండే పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అలాగే కమీషన్ పెంపునకు సంబంధించి రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన రూ.54 కోట్లను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
“ప్రతి నెల 87.54 లక్షల కుటుంబాలకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామని, బియ్యం పంపిణీ చేసిన తర్వాత డీలర్ల దగ్గర ప్రతి నెల 30 లక్షల గన్నీ సంచులు ఉండిపోతున్నాయి. గతంలో ఈ సంచులను డీలర్లకు ప్రయివేట్ గన్నీ కంట్రాక్టర్లకు అమ్ముకునేవారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులు పెరగడం దానికి అనుగణంగా పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్ళు జరుపుతుండటంతో గన్నీ సంచుల వినియోగం భారీగా పెరిగింది. ఈ యాసంగి సీజన్లో దాదాపు 9 కోట్ల పాత గన్నీ సంచులు అవసరం కానున్నాయి. పాత గన్నీ సంచుల వినియోగం పెరగడంతో రేషన్ డీలర్లు ఖచ్చితంగా గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే గన్నీ సంచుల ధరలు పెంచడం జరిగింది. ప్రతి గన్నీ సంచిని పౌరసరఫరాల సంస్థకే విక్రయించేలా క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్లు, జిల్లా మేనేజర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్ డీలర్ల న్యాయపరమైన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాము” అని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మరోవైపు 92 వేల మంది ప్రైవేట్ టీచర్లకు సన్న బియ్యం పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ