హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం నాడు 73వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. భారత ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేపాల్, మాల్దీవులు మరియు భూటాన్ యొక్క స్నేహపూర్వక దేశాల నుండి 17 మంది ఆఫీసర్ ట్రైనీలతో సహా మొత్తం 132 ఆఫీసర్ ట్రైనీలు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసి, ఈ రోజు అకాడమీ నుండి ఉత్తీర్ణులయ్యారు. అకాడమీలో ఐపీఎస్ ఆఫీసర్ యొక్క ప్రాథమిక శిక్షణ ముగింపును దీక్షాంత్ పరేడ్ సూచిస్తుంది. పరేడ్ లో 132 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొనగా, 115 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు, 17 మంది విదేశీ ఆఫీసర్లు ఉన్నారు. 115 మందిలో 27 లేడీ ఆఫీసర్ ట్రైనీలు ఉండగా, 17 విదేశీ ఆఫీసర్లలో భూటాన్ నుండి 6, నేపాల్ నుండి 5, మాల్దీవుల నుండి 6 గురు ఉన్నారు.
నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అతుల్ కర్వాల్ తన స్వాగత మరియు పరిచయ ప్రసంగంలో ఫేజ్-1 శిక్షణలో మొదటి స్థానంలో నిలిచిన పరేడ్ కమాండర్ దర్పన్ అహ్లువాలియాను అభినందించారు మరియు పాసింగ్ అవుట్ ఆఫీసర్ ట్రైనీల వివిధ శిక్షణా సెషన్లను వివరించారు. అధికారుల్లో ధైర్యం, చిత్తశుద్ధి, కరుణ, టీం వర్క్, వినయం వంటి విలువలను పెంపొందించేందుకు అకాడమీ తన శాయశక్తులా కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. పరేడ్ లో ఉన్న ఆఫీసర్స్ అత్యున్నత నైపుణ్యాలు కలిగిన అధికారులుగా పేరు తెచ్చుకుంటారని చెప్పారు. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గౌరవ వందనం స్వీకరించారు. అకాడమీలో శిక్షణ పొందిన స్నేహపూర్వక దేశాలకు చెందిన మెరిటోరియస్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు మరియు ఆఫీసర్ ట్రైనీలకు కూడా ఆయన ట్రోఫీలను అందజేశారు.
అనంతరం అజిత్ దోవల్ మాట్లాడుతూ, పరేడ్ సందర్భంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పరేడ్ కమాండర్ దర్పన్ అహ్లువాలియా మరియు పరేడ్ సభ్యులను అభినందించారు. అనేక ట్రోఫీలు గెలుచుకున్న విదేశీ ఆఫీసర్ ట్రైనీలను కూడా ఆయన అభినందించారు. అకాడమీలో శిక్షణ సందర్భంగా అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఆఫీసర్ ట్రైనీలకు ఆయన ట్రోఫీలను అందజేశారు. దేశ నిర్మాణంలో కర్తవ్య బలిపీఠం వద్ద తమ ప్రాణాలను అర్పించిన ఐపీఎస్ అమరవీరుల అత్యున్నత త్యాగం, కీలక పాత్రను ఆయన స్మరించుకున్నారు. ఆఫీసర్ ట్రైనీలు ఒక జట్టుగా మరియు ఈ దేశ సేవలో అంకితభావంతో కుటుంబంగా కలిసి పనిచేయాలని ఆయన ఉద్బోధించారు. చట్టాన్ని అమలు చేయడంతోపాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని గుర్తు చేశారు. పోలీసు పనితీరులో పరివర్తనాత్మక మార్పులను తీసుకురావడానికి ఆఫీసర్ ట్రైనీలు తమ సాంకేతిక సామర్థ్యాలను అప్డేట్ చేసుకోవాలని మరియు సరైన వైఖరిని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ముందు దేశ సేవలో ప్రాణాలు అర్పించిన భారత పోలీసు సర్వీస్ అమరవీరులకు అజిత్ దోవల్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు కూడా నివాళులు అర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ