తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరుతో శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ సమావేశాల ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసంగించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ముఖ్యంమత్రి కేసీఆర్ పైన పలు ఆరోణలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 15 రోజుల్లో 11 వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నామని, సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై ప్రజలోకి తీసుకెళ్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులతో పాటు ఉద్యోగులు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ శైలిలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నిర్మిస్తామని అన్నారు. మంత్రి కేటీఆర్ రోడ్డుపక్కన ఉన్న గుడులు, మసీదులు కూల్చుతామని చెప్తున్నారని, ఆయనకు ధైర్యముంటే ఓల్డ్ సిటీ నుంచే ఆ పని మొదలు పెట్టాలని సవాల్ చేశారు. పైకి వేరువేరుగా కనిపిస్తున్నా ఎంఐఎం, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని, అందుకే తాజ్ మహల్ కన్నా అద్భుతంగా కొత్త సచివాలయం కట్టారని అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ ను ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే సెక్రటేరియట్ను తాజ్ మహల్ నమూనాలో కట్టారని విమర్శించిన ఆయన తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ డోమ్లు కూల్చేస్తామంటూ ప్రకటించారు. ఇదిలా ఉండగా మరోవైపు సీఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న ఈ సచివాలయాన్ని ప్రారంభించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE