తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముంబయి పర్యటన విజయవంతంగా జరిగింది. ఫిబ్రవరి 21, ఆదివారం నాడు సీఎం కేసీఆర్ ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ తో భేటీ అయి జాతీయ రాజకీయాలు, దేశ అభివృద్ధి సహా పలు అంశాలపై కీలకంగా చర్చించారు. ముందుగా సీఎం ఉద్ధవ్ థాకరేతో భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియాసమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, దేశ రాజకీయాలపై చర్చించే నేపథ్యంలో మహారాష్ట్రకు వచ్చానని, దేశ అభివృద్ధి, తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా మహారాష్ట్ర సీఎంతో చర్చించామన్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రం తరువాత దేశంలోని పరిస్థితులు మారాల్సి ఉన్నాయన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చేపట్టేందుకు, విధి విధానాలను మార్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించామన్నారు. మహారాష్ట్రతో దాదాపు 1000 కిలోమీటర్ల సరిహద్దును తెలంగాణ పంచుకుంటున్నదని, భవిష్యత్తులో కూడా ఇరు రాష్ట్రాలు చాలా విషయాల్లో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. చర్చలో అన్ని విషయాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇతర నేతలతో కూడా చర్చిస్తాం. అతి త్వరలో హైదరాబాద్ లేదా మరోచోట అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతాం. శివాజీ, బాల్ థాకరే లాంటి యోధులను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా కలిసి పనిచేయాల్సి ఉంది. హైదారాబాద్ రావాలని సీఎం ఉద్దవ్ ను ఆహ్వానిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని, తెలంగాణ, మహారాష్ట్ర రెండు సోదర రాష్ట్రాలని, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పలు అంశాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చామని, మహారాష్ట్ర, తెలంగాణల మధ్య 1000 కిలోమీటర్ల బోర్డర్ ఉందని, ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు ఎప్పటికీ కలిసి పనిచేస్తామన్నారు. దేశం మంచి కొరకు కేసీఆర్ తో కలిసి నడుస్తామని అన్నారు. మా చర్చల్లో రహస్యమేమీ లేదని, దేశంలో మార్పు కోసం ఏదైనా బహిరంగంగానే చర్చిస్తామని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని, అవి దేశానికి మంచివి కావని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు.
అనంతరం ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లగా, శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే సాదరంగా ఆహ్వానించారు. శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్, శరద్ పవార్ లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. భారత రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న నేతగా శరద్ పవార్ ను సీఎం కేసీఆర్ అభివర్ణించారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి సహకరించిన శరద్ పవార్ కు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. శరద్ పవార్ మాట్లాడుతూ, దేశ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడిందన్నారు. సంక్షేమ పథకాలతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, అదే స్పూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ పర్యటనలో సీఎం కేసిఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు జె.సంతోష్ కుమార్, డా.రంజిత్ రెడ్డి, బి.బి.పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ