వర్షాకాలం ప్రారంభమైనందున తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట సాయం అందించనుంది. వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు చేపట్టిన ‘రైతుబంధు’ పథకం ద్వారా అర్హులకు ఈరోజు నుంచి నిధులు పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68.10 లక్షల మంది రైతులు రైతుబంధు సాయానికి అర్హులని, దీనికోసం రూ. 7521.80 కోట్లను నేటినుంచి పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద దాదాపు కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుందని, అలాగే ఈసారి కొత్తగా 3.64 లక్షల మందికి రైతుబంధుకు ఎంపిక చేశామని తెలిపారు.
మొదటి రోజు ఒక ఎకరా ఉన్నవారికి సాయం అందనుందని, ఆరోహణా క్రమంలో రైతుల ఖాతాలలో జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అయితే మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసు బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది మరియు ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని, అలాగే జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీకి వ్యవసాయశాఖ తరుపున ఏర్పాట్లు పూర్తిచేశామని, ఉదయం పూటే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమయ్యేలా చర్యలు తీసుకొన్నామని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పేర్కొన్నారు. రైతుబంధు పెట్టుబడి సాయం రైతులందరి ఖాతాల్లో జమ చేస్తామని ఆయన తెలిపారు. మంగళవారం ఎకరం భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు రూ.586.65 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నామని తెలియజేశారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే స్థానిక ఏఈవోను కలిసి ఫిర్యాదు చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY