మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆర్వో బదిలీపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని కేటీఆర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కాణమని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఈసీపైన బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని అన్నారు.
“గతంలో మా అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం. మా పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది. బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలి. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ బదిలీపైన ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ జాతీయ నాయకత్వంలో ఈసీ పని చేస్తుంది, మునుగోడులో ఓటమి తప్పదు అనే బీజేపీ అడ్డదారులు తొక్కుతుంది” అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ముందుగా మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి (ఆర్వో)పై ఈసీ వేటు వేసింది. మునుగోడు ఉపఎన్నికలో పోటీచేస్తున్న యుగతులసి పార్టీ అభ్యర్థి కె. శివకుమార్ ముందుగా తనకు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించి, ఆ తరవాత బేబీ వాకర్ గుర్తుకు మార్చారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ గుర్తు మార్పు విషయంలో ఆర్వోపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఆర్వో నుంచి వివరణ తీసుకొని శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా నివేదిక పంపాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి ఆదేశాలు ఇచ్చింది. ఈ లోపుగానే మునుగోడు ఆర్వోను బదిలీచేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY