దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింధీయా, రాష్ట్ర మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు ప్రారంభించారు. డ్రోన్ ల సహాయంతో రవాణా సౌకర్యం అంతగా లేని మారుమూల/అటవీ ప్రాంతాలలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు ఔషదాలు, మందులు, వాక్సిన్ లను పంపిణీ చేసే మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా వికారాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ఐటీ శాఖ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, నీతి ఆయోగ్, హెల్త్నెట్ గ్లోబల్ వంటి సంస్థలతో కలిసి ప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా వికారాబాద్ నుంచి నెలరోజుల పాటుగా డ్రోన్ల ద్వారా ఔషదాలు, వ్యాక్సిన్ల సరఫరాపై పరిశీలన జరపనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు జిల్లా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ముందుగా మూడు డ్రోన్ కంపెనీల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా ఔషదాలు సరఫరా చేస్తున్నామని, ఈరోజు చారిత్రాత్మక దినమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ప్రజలకు తక్షణమే వైద్యాన్ని, వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు అందరి తరపున స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. కొత్తగా వచ్చిన టెక్నాలజీ సామాన్యులకు ఉపయోగపడాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా ఔషదాలు, రక్తం సరఫరా చేయవచ్చని, ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ భారతదేశానికే మార్గదర్శకంగా నిలబడుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ