బీఆర్ఎస్ రాకతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, అందుకే ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం సందర్శిచుకున్న అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారబోతోందని, ఇది అర్ధమైనందునే తెలంగాణ నేతలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ఎన్ని వచ్చినా తమను ఏమీ చేయలేవని, బీజేపీ రాజకీయాలకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మరని, మొన్నటి మునుగోడు ఫలితంతోనే ఇది తేలిపోయిందని పేర్కొన్నారు.
తనకు ఈడీ నుంచి నోటీసు వచ్చిందని తెలిపిన రోహిత్ రెడ్డి, ఆ నోటీసులో ఎలాంటి స్పష్టమైన వివరాలు లేవని వెల్లడించారు. ఏ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేశారో చెప్పలేదని, ఇది కేవలం కేవలం రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. కానీ దీనిపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు సవాల్ విసిరారు. రేపు ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడకు వస్తానని, బండి సంజయ్కు ధైర్యముంటే వచ్చి నిరూపించాలని ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశారు. ఒకవేళ ఆయన రుజువు చేయలేకపోతే తనతో పాటు తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ ప్రజానీకానికి కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ