యునైటెడ్ కింగ్డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు యూకే నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. యూకే నుంచి గత నెల రోజుల్లో మొత్తం 1214 మంది ఏపీకి రాగా, ఇప్పటికి 1158 మందిని గుర్తించినట్లుగా వెల్లడించారు. మరో 56 మంది వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
యూకే నుంచి వచ్చిన వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. పాజిటివ్ గా తేలిన ఆరుగురి శాంపిల్స్ను జీనోమ్-సీక్వెన్సింగ్ కోసం పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించామని, రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. యూకే నుంచి వచ్చినవారిలో కృష్ణా, అనంతపురం, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరికి, గుంటూరులో ఇద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెప్పారు. వీరిని కోవిడ్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. యూకే నుంచి ఏపీకి వచ్చిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ