వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగలనుందా?.. షర్మిల వెంటే తన అడుగులన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ను వీడనున్నారా?.. తిరిగి సొంత గూటికి వెళ్లనున్నారా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన తిరిగి వైసీపీ గూటికి వెళ్లబోతున్నారని.. ఈసారి కూడా వైసీపీ తరుపున మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి.. ఆళ్ల రామకృష్ణారెడ్డితో సమావేశం కావడంతో ఆ వార్తలకు బలం చేకూరింది.
మంగళగిరిలో గత రెండు పర్యాయాలు ఆళ్లరామకృష్ణారెడ్డి గెలుపొందారు. 2014 లో వైసీపీ తరుపున మంగళగిరి నుంచి బరిలోకి దిగిన ఆర్కే.. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై 12 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో మరోసారి అదే స్థానం నుంచి పోటీచేశారు. ఈసారి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్పై 5 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నారా లోకేష్ను ఓడించడంతో ఆర్కే సంచలనంగా మారారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆర్కేకు టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో గంజి చిరంజీవికి అవకాశం ఇచ్చారు.
దీంతో కొద్దిరోజుల క్రితం ఆర్కే వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైసీపీ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆర్కే కూడా ఆ పార్టీలో చేరిపోయారు. కొద్దిరోజులుగా ఆర్కే కాంగ్రెస్ తరుపున మంగళగిరి నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అటు ఈసారి కూడా మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈసారి మంగళగిరి నుంచి చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని జగన్ బరిలోకి దించుతున్నారు.
అయితే ఇక్కడే వైసీపీ సమస్య ఎదురయింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లినప్పటికీ.. గత పదేళ్లు ఆయనే ఎమ్మెల్యేగా ఉండడంతో వైసీపీ క్యాడర్ అంతా ఆయన వెంటే ఉందట. అక్కడ చిరంజీవికి వ్యతిరేకంగా వైసీపీ క్యాడర్ ఉందట. ఎన్నికల్లో చిరంజీవికి క్యాడర్ సహకరించే అవకాశాలు ఏమాత్రం లేవట. దీంతో పునరాలోచనలో పడ్డ జగన్.. తిరిగి ఆర్కేను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారట. మరోసారి ఆయన్నే మంగళగిరి నుంచి బరిలోకి దించాలని అనుకుంటున్నారట.
ఆర్కేను సొంతగూటికి తీసుకొచ్చే బాధ్యతలను జగన్.. విజయసాయిరెడ్డికి అప్పగించారట. ఇప్పటికే హైదరాబాద్లో ఆళ్ల రామకృష్ణారెడ్డితో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారట. తిరిగి సొంతగూటికి ఆహ్వానించారట. అటు ఆర్కే కూడా వైసీపీ గూటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈరోజు లేదా రేపు ఆర్కే తాడేపల్లిలో అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారట. ఆ తర్వాత మంచిరోజు చూసుకొని వైసీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE